యాదాద్రి వార్షిక ఆదాయం రూ.169 కోట్లు

  • ఆలయ పునః నిర్మాణం తర్వాత పెరిగిన భక్తుల రద్దీ
  • మూడు రెట్లు పెరిగిన ఆదాయం
  • రూ. 1200 కోట్లతో ఆలయాన్ని తీర్చిదిద్దిన ప్రభుత్వం
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్యతో పాటు, హుండీ ఆదాయం సైతం గణనీయంగా పెరిగింది. యాదాద్రి పునర్నిర్మాణం తర్వాత భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారిని దర్శించుకొని హుండీలో కానుకలు వేస్తున్నారు. వీటితో పాటు టికెట్లు, ఇతర పూజా, సేవా కార్యక్రమాలు, ప్రసాదం రుసుముల తర్వాత  2022– 23లో ఆలయం వార్షిక ఆదాయం రూ.169 కోట్లకు చేరుకుంది. 2014లో రాష్ట్రం ఆవిర్భవించిన కొత్తలో ఆలయ వార్షిక ఆదాయం రూ. 61 కోట్లు ఉండగా.. అది ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది. 

టికెట్లు, నిత్య పూజలు, లడ్డూలు, విరాళాలు, హుండీ సేకరణ, కల్యాణోత్సవాలు, ఫిక్స్ డ్ డిపాజిట్లు వంటి వాటి ద్వారా రోజువారీ ఆలయం ఆదాయంలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. 2021-22 ఏడాదిలో దాదాపు 73 లక్షల మంది వచ్చేవారని, ఆలయ పునరుద్ధరణ తర్వాత అనేక సౌకర్యాలు కల్పించడంతో భక్తుల సంఖ్య  86 లక్షలకు చేరుకుందని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.1200 కోట్లు వెచ్చించి ఆలయాన్ని తీర్చిదిద్దింది. రవాణా, వసతి సహా అనేక సౌకర్యాలు పెంచడం, హైదరాబాద్ కు సమీపంలో ఉండటంతో సాధారణ రోజుల్లో రోజుకు ఐదు వేల మంది.. వారంతాల్లో 40 వేల మంది వరకు దర్శనానికి వస్తున్నారని అధికారులు తెలిపారు.

Yadadri Bhuvanagiri District
yadadri
temple
revenue

More Telugu News